
అత్యధిక ఉష్ణోగ్రతలు, ప్రతికూల వాతావరణ పరస్థితులు ఉండే ఎత్తైన ప్రాంతాల్లో సైతం మెరుగ్గా ఎగరగలిగే సామర్థ్యం ఉన్న లైట్ యుటిలిటీ హెలికాప్టర్(ఎల్యూహెచ్)ను విజయవంతంగా పరీక్షించినట్లు హిందూస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తెలిపింది. దీన్ని పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు పేర్కొంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో పది రోజుల పాటు దీన్ని పరీక్షించినట్లు వివరించింది. ఇక దీన్ని సైన్యంలో చేర్చడానికి కావాల్సిన అనుమతులు త్వరలోనే లభించనున్నట్లు అధికారులు తెలిపారు.
లేహ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 3300 మీటర్ల ఎత్తున అన్ని రకాల పరీక్షల్ని సమర్థంగా నిర్వహించినట్లు హెచ్ఏఎల్ వెల్లడించింది. దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో 5000 మీటర్ల ఎత్తుకు వెళ్లి తన సామర్థ్యాన్ని చాటుకుందని తెలిపింది. అత్యంత ఎత్తులో ఉండే సియాచిన్ సైనిక స్థావరం వద్దకు సరుకు రవాణ సామర్థ్యాన్ని సైతం ప్రదర్శించిందని వెల్లడించింది. పరీక్షల్లో భాగంగా అత్యంత ఎత్తులో ఉన్న అమర్, సోనం హెలిప్యాడ్లపై పైలట్లు దీన్ని ల్యాండ్ చేసినట్లు తెలిపింది.
ఈ టెస్టింగ్ ఆపరేషన్లో భారత వాయుసేనతో పాటు హెచ్యూఎల్ పైలట్లు పాల్గొన్నారు. అలాగే ‘సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్వర్తీనెస్ అండ్ సర్టిఫికేషన్'(సీఈఎమ్ఐఎల్ఏసీ) అధికారులు కూడా ఉన్నారు. సరిహద్దుల్లో చైనాతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడం గమనార్హం.



