
విశాఖ సాగరతీరంలో రెండో ప్రపంచయుద్ధం నాటి కాంక్రీటు బంకర్లు బయటపడ్డాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ బంకర్లు వెలుగు చూశాయి. అరుదైన బంకర్లను చూసేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు.
విశాఖపట్నం, యారడ, జాలరిపేట తదితర ప్రాంతాల్లో సముద్రం ఇసుక కోతతో బంకర్లు బయటపడ్డాయి. వీటిని చూసిన విశాఖ వాసులు ఆశ్చర్యపోతున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ వారి తరఫున జపాన్తో భారతీయ నావికులు యుద్ధం చేశారు. శత్రు నౌక, వాయు దాడుల నుంచి సాగరతీరంలో ఈ బంకర్ల ద్వారా రక్షణ పొందినట్లు తెలుస్తోంది. జపాన్ నావికా సైన్యాన్ని ఎదురించేందుకు కాంక్రీట్ బంకర్ల నిర్మాణం జరిగిందని భావిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైన్యం విశాఖపట్నంపై కూడా దాడిచేసేందుకు సిద్ధపడిందని చరిత్రకారులు చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలతోనే విశాఖలో తూర్పు నావికాదళం ఏర్పడిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.





