కరోనా యుద్ధవీరులకు అరుదైన గౌరవం లభించింది. కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టడంలో వారు చేస్తున్న అలుపెరుగని పోరాటానికి యావత్ దేశం జయహో అంటూ సలాం కొడుతోంది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నోళ్లే ఇప్పుడు సర్కారీ వైద్యులే భేష్ అంటూ కితాబిస్తున్నాయి.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులను వినూత్నంగా సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా త్రివిధ దళాలు దిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కొవిడ్ ఆసుపత్రులపై హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించాయి. విశాఖ నగరంలోని ఛాతి, అంటువ్యాధుల ఆసుపత్రి, గీతం ఆసుపత్రులపై వాయుసేన సిబ్బంది హెలీకాప్టర్తో ఆదివారం ఉదయం పూలజల్లు కురిపించారు. రక్షణ దళాల అధికారులు ఈ సందర్భంగా వైద్యులను సంత్కరించారు. దిల్లీలోని పోలీస్ యుద్ధస్మారకం వద్ద వైమానిక హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. పోలీసుల గౌరవార్థం వైమానిక అధికారులు యుద్ధ స్మారకానికి దండలు వేశారు. విశాఖ, ముంబయి, చెన్నై, కొచ్చిలోని నౌకలకు ఈరోజు రాత్రి 7.30గంటల నుంచి 11.59 వరకు దీపాలంకరణ చేయనున్నారు.