
వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ (SFD) మరియు పీబీ సిద్ధార్థ కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో విజయవాడలో 1000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP) విగ్రహాలు, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించడం వల్ల నిమజ్జనం సమయంలో జలాశయాలు కలుషితమయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు వివరించారు. రసాయన రంగులు, ఇతర పదార్థాలు నీటిలో కలవడం వల్ల జలచరాలు, నీటి నాణ్యతతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో మట్టి వినాయక విగ్రహాలనే పూజించి, పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలు సహజంగా నీటిలో కలిసిపోవడంతో పర్యావరణంపై భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

వినాయక చతుర్థి సందర్భంగా భక్తి భావంతో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి కుటుంబం మట్టి వినాయకుడిని పూజించేలా ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
“భక్తితో వినాయకుడిని పూజిద్దాం.. ప్రకృతిని కూడా కాపాడుదాం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజలకు పర్యావరణహితమైన వినాయక చతుర్థి నిర్వహణపై అవగాహన కల్పించింది.