News

పెళ్లి పేరుతో భారత మహిళలను ట్రాప్ చేస్తున్న జైషే మహమ్మద్

5views

పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ (జేఇఎం) ఉగ్రవాద సంస్థ, భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన పన్నాగం పన్నింది. ప్రేమ, పెళ్లి పేరుతో భారతీయ మహిళలను వలలో వేసి, వారిని పాకిస్థాన్‌కు తరలించి, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించుకోవాలని చూస్తోంది. ఈ కుట్రను భారత నిఘా వర్గాలు (ఐబీ) ఛేదించాయి. జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలో గతేడాది అక్టోబర్‌లో ఏర్పాటైన ‘జమాత్-ఉల్-మోమినాత్’ (జేయుఎం) అనే మహిళా విభాగం ఈ కుట్రకు కేంద్రంగా పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

ఆన్‌లైన్ ప్రేమ.. పాకిస్థాన్‌లో శిక్షణ
ఐబీ అధికారుల కథనం ప్రకారం.. ఈ ఉగ్రముఠాలోని యువకులు భారతీయ మహిళలతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంటున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలో నివసించే మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సుమారు ఆరు నెలల పాటు వారితో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ, ప్రేమ నటిస్తూ నమ్మకం పెంచుతారు. తాము నిజమైన ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇస్తామని నమ్మిస్తారు. ఈ సమయంలో గూఢచర్యానికి సంబంధించిన సున్నితమైన ప్రశ్నలు ఏవీ అడగకుండా జాగ్రత్తపడతారు. పూర్తిగా వారిని నమ్మించి, పెళ్లికి ఒప్పించిన తర్వాత పాకిస్థాన్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తారు. పాకిస్థాన్‌కు చేరాక, వారిని ఉగ్రవాద భావజాలంతో నింపి, గూఢచారులుగా మార్చి తిరిగి భారత్‌కు పంపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

జమ్మూకశ్మీర్ నుంచి రాజస్థాన్‌పైకి దృష్టి
గతంలో ఇలాంటి కార్యకలాపాలు జమ్మూకశ్మీర్‌కే పరిమితం కాగా, ఇప్పుడు ఉగ్రవాదులు తమ దృష్టిని రాజస్థాన్‌పైకి మార్చారు. పాకిస్థాన్‌తో రాజస్థాన్‌కు 1,070 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉండటమే దీనికి ప్రధాన కారణం. శ్రీ గంగానగర్ నుంచి బార్మర్ వరకు విస్తరించిన ఈ సరిహద్దు ప్రాంతాల్లోని యువతుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను ఐఎస్ఐ మద్దతు ఉన్న ఉగ్రవాదులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సామాజికంగా ఒంటరితనం అనుభవిస్తున్న, కుటుంబ సంబంధాలు సరిగా లేని, మానసికంగా బలహీనంగా ఉన్న యువతులే వీరి ప్రధాన లక్ష్యం. ఇలాంటి వారు ప్రేమ, ఆప్యాయతలకు సులభంగా ఆకర్షితులవుతారని ఉగ్రవాదులు భావిస్తున్నారు.

మూడు మార్గాల్లో పాకిస్థాన్‌కు చేరవేత
యువతి పెళ్లికి అంగీకరించగానే, పాస్‌పోర్ట్ సిద్ధం చేసుకోమని చెబుతారు. రాజస్థాన్ సరిహద్దుల గుండా నేరుగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించడం వీరి మొదటి ప్రాధాన్యత. అది సాధ్యం కాకపోతే, నేపాల్ మార్గం ద్వారా లేదా సౌదీ అరేబియా ద్వారా పాకిస్థాన్‌కు చేరవేసేందుకు ప్రత్యేక ఏజెంట్ల సహాయం తీసుకుంటున్నారు. ఈ మార్గాల్లో వీరిని పాకిస్థాన్‌కు చేర్చడానికి జైషేకు చెందిన ప్రత్యేక ఏజెంట్లు పనిచేస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి.

ఈ కుట్ర కేవలం గూఢచర్యం కోసమే కాదని, భారత్‌లో జైషే మహిళా విభాగం (జేయుఎం) నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించేందుకు కూడా ఈ పన్నాగం పన్నుతున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. పాక్‌కు చేరిన మహిళల ద్వారా భారత్‌లోని ఇతర యువతీయువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేయడం కూడా వారి దీర్ఘకాలిక లక్ష్యమని స్పష్టం చేశారు.