
పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో హిందూ మరియు సనాతన వారసత్వాన్ని ప్రతిబింబించే పాత ప్రాంతీయ పేర్లను తిరిగి పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభమైంది. గత రెండు నెలల కాలంలో నగరంలోని తొమ్మిది బహిరంగ ప్రదేశాలకు 1990లలో పెట్టిన ఇస్లామిక్ పేర్లను తొలగించి, వాటి అసలైన హిందూ చారిత్రక పేర్లను తిరిగి అమలు చేశారు.
ఈ మార్పుల్లో భాగంగా, ‘ఇస్లాంపురా’ ప్రాంతాన్ని తిరిగి ‘కృష్ణానగర్’గా అధికారికంగా ప్రకటించగా, ‘బాబ్రీ మసీదు చౌక్’కు మళ్లీ ‘జైన్ మందిర్ చౌక్’ అనే పూర్వపు పేరును పునరుద్ధరించారు. కొత్త పేర్లతో బోర్డులను కూడా స్థానిక అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎటువంటి మితవాద లేదా జిహాదీ సంస్థలు నిరసన వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
సమాచారం ప్రకారం, ఈ పేరు మార్పులను పాకిస్తాన్లోని సింధ్ మరియు ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సులలో కూడా పాత హిందూ, సిక్కు వారసత్వ పేర్లను పునరుద్ధరించే అవకాశముంది.
1990లలో అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం పాకిస్తాన్లో అనేక ప్రదేశాల పేర్లు మార్చబడ్డాయి. ఆ సమయంలో నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, పర్వేజ్ ముషర్రఫ్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం షరీఫ్ ప్రభుత్వం ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటూ, చారిత్రక గుర్తింపులను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తోంది.
లాహోర్లోని అనార్కలి ప్రాంతానికి చెందిన మౌలానా వాజిద్ ఖాద్రీ మాట్లాడుతూ, “ఆలయాలు, గురుద్వారాలతో ఇస్లాంకు ఎటువంటి విరోధం లేదు. జైన్ మందిర్ చౌక్ పేరును బాబ్రీ మసీదు చౌక్గా మార్చడం పూర్తిగా రాజకీయ నిర్ణయం. ప్రజలు మాత్రం ఇప్పటికీ దానిని పాత పేరుతోనే పిలుస్తున్నారు” అని అన్నారు.
అలాగే బీకన్హౌస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సాద్ మాలిక్ మాట్లాడుతూ, “లక్ష్మీ చౌక్ అనేది కేవలం ఒక పేరు కాదు; అది లాహోర్ వారసత్వానికి ప్రతీక. తరతరాలుగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన ఈ పేర్లను పునరుద్ధరించడం స్వాగతించదగిన విషయం” అని వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాన్ని పాకిస్తాన్లో చారిత్రక, సాంస్కృతిక మూలాలను తిరిగి గుర్తించే ప్రయత్నంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.





