News

జమ్మూ కాశ్మీర్‌లో మదర్సాపై నిషేధం

5views

జమ్మూ మరియు కాశ్మీర్ పరిపాలన యంత్రాంగం, షోపియాన్‌లోని ఇమామ్ సాహిబ్‌లో ఉన్న దారుల్ ఉలూమ్ జామియా సిరాజ్-ఉల్-ఉలూమ్ అనే మదర్సాను, 1967 నాటి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద “చట్టవిరుద్ధ సంస్థ”గా ప్రకటించింది. నిషేధిత సంస్థ అయిన జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలను ఈ చర్యకు ఆధారంగా పరిపాలన యంత్రాంగం పేర్కొంది. అలాగే, ఆర్థిక అవకతవకలు మరియు సంస్థ ప్రాంగణాన్ని దుర్వినియోగం చేశారని తెలిపింది

పరిపాలన వర్గాల ప్రకారం, ఈ మదర్సాకు నిషేధిత సంస్థ జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో జమాత్-ఎ-ఇస్లామీని నిషేధించిన విషయం తెలిసిందే.

షోపియాన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమర్పించిన ఒక నివేదిక (డాసియర్) ఆధారంగా కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ రెండు పేజీల ఉత్తర్వు జారీ చేశారు. ఈ నివేదిక, షోపియాన్ జిల్లాలోని ఇమామ్ సాహిబ్‌లో ఉన్న దారుల్ ఉలూమ్ జామియా సిరాజ్-ఉల్-ఉలూమ్‌లో జరుగుతున్నట్లు ఆరోపించబడిన చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రముఖంగా ప్రస్తావించింది.

 ఏప్రిల్ 24న వెలువడిన ఈ ఉత్తర్వులో, సంబంధిత మదర్సా నిషేధిత సంస్థతో నిరంతర, రహస్య సంబంధాలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు.అదేవిధంగా, యూఏపీఏ చట్టం 1967లోని సెక్షన్ 8(1) ప్రకారం, ఈ మదర్సాను ‘చట్టవిరుద్ధ సంఘం/ప్రదేశం’గా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు.

 ఈ మదర్సా తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించడంలో పాలుపంచుకుందని మరియు ఈ సంస్థ పూర్వ విద్యార్థులలో చాలామంది ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయని ప్రభుత్వ ఉత్తర్వు స్పష్టం చేస్తుంది. ఆర్థిక పారదర్శకత లోపించడం, నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానాలను కూడా ఈ మదర్సాను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించడానికి ప్రభుత్వం కారణంగా పేర్కొంది.

ఈ చర్య ప్రాంతీయ భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదిగా అధికారులు పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం మరియు శాంతి భద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.