
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేక నిరసనలకు కేంద్రంగా ఉన్న ఢిల్లీలోని షాహీన్బాగ్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాల్ని మోహరించారు. పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. సమావేశాలు నిర్వహించొద్దని పోలీసులు వీధుల్లో తిరుగుతూ ప్రజలకు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. షాహీన్బాగ్ ఆందోళనకారుల్ని రోడ్డుపై నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మార్చి 1న నిరసన ప్రదర్శన నిర్వహించాలని తొలుత ‘హిందూ సేన’ పిలుపునిచ్చింది. కానీ, శనివారం అనూహ్యంగా నిరసన ప్రదర్శనను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. పోలీసులు ఒత్తిడి వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అలాగే తమ ‘హిందూ సేన’ జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తాను అరెస్టు చేశారని ఆరోపించింది.
దీనిపై స్పందించిన పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన తర్వాతే ‘హిందూ సేన’ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.





