
ఒక కాలేజీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో హిందూ విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. ఇది తెలుసుకున్న హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వీహెచ్పీ కార్యకర్తలు ఆ కాలేజీ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. మార్చి 11న భోపాల్లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో ఇఫ్తార్ విందు జరిగింది. ఆ కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థులు, సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హిందూ విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ కాలేజీ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఇఫ్తార్ కార్యక్రమంలో హిందూ యువతులు పాల్గొనడాన్ని తప్పుపట్టారు. ‘ఇస్లామీకరణ’ను ఆ కాలేజీ ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. ఆ కాలేజీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు హనుమాన్ చాలీసా పఠించారు.
మరోవైపు కొంత మంది వీహెచ్పీ కార్యకర్తలు కాలేజీ క్యాంపస్లో గంగా జలం చల్లి ‘శుద్ధి’ ఆచారం నిర్వహించారు.
అయితే క్యాంపస్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడాన్ని కాలేజీ యాజమాన్యం సమర్థించింది. మత సామరస్యంలో భాగంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించింది.





