News

విజయవాడలో ఆర్గానిక్‌ రైతోత్సవం

187views

రసాయన ఎరువుల తాకిడికి తాళలేక తల్లడిల్లుతున్న నేల తల్లికి సేంద్రియ సాగుతో సాంత్వన కలింగించడమే లక్ష్యంగా ఈ రైతులు ఆర్గానిక్‌ సాగులో దూసుకెళ్తున్నారు. ప్రకృతిలో దొరికే ఔషధ గుణాలున్న ఆకులు, ఇతర పదార్థాలతో తయారు చేసిన కషాయాలు, ఎరువులతో అద్భుతాలు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి పొందుతూనే ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచాల్లా మారుతున్నారు. విజయవాడలో నిర్వహించిన ఆర్గానిక్‌ రైతోత్సవంలో వీరి ఉత్పత్తులు ప్రదర్శించారు.

14 రకాల వరి

  • ఏ.కొండూరుకు చెందిన శబరీనాథ్‌ పదేళ్లుగా సేంద్రియ సాగులో కొనసాగుతున్నారు. కూజీపటాలియ, నవారా, మైసూరు మల్లిగ, బ్లాక్‌రైస్, కాలాబట్ట, రాజముడి, రక్తశాలి వంటి 14 వరి రకాలను పండిస్తున్నారు. మిరపకు అంతర పంటలుగా శనగలు, కందులు, పసుపు, మునగను 54 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
  • సాధారణంగా వరికి ఎకరానికి రూ.40వేలు పెట్టుబడి అవుతుంటే ఈయన రూ.25వేలతో సాగు చేసేస్తున్నారు. స్వయంగా తయారు చేసుకున్న బీజామృతం, ఘన, ద్రవ జీవామృతాలనే వినియోగిస్తున్నారు. తాను పండించిన వరి, పప్పుధాన్యాలు, మిరప మర పట్టించి ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు.
  • వీటి వినియోగం వల్ల లైంగిక సామర్థ్యం పెంపుతో పాటు మలబద్ధకం, మధుమేహం, రక్తహీనత, అధిక బరువు, మహిళల్లో పీసీవోడీ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. సేంద్రియ సాగులో శబరీనాథ్‌ కృషికి 2021లో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా రైతునేస్తం పురస్కారం పొందారు.
  • విభిన్న పంటలతో…

  • పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడుకు చెందిన వీరభద్రరావు 14 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 8.5 ఎకరాల్లో మిరప ప్రధాన పంటగా ధనియాలు, ఆవాలు, ఉల్లిపాయ, పెసర, స్వీట్‌కార్న్, బొబ్బొర వంటి 10 అంతర పంటలుగా సాగు చేస్తున్నారు.
  • రసాయన ఎరువులు వాడిన పొలాల్లో ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తే గొప్ప. సేంద్రియ సాగు ద్వారా ఎకరానికి రూ.1.5లక్షల పెట్టుబడితో 20 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు.
  • సాధారణంగా క్వింటాల్‌ మిర్చి రూ.15-20వేలు ఉండడం గగనం.వీరభద్రరావు రూ.50వేలకు అమ్ముతున్నారు. మిర్చి విక్రయాలతో పాటు ఆయనే కారం మర పట్టించి అమ్ముతున్నారు. ఈ సీజన్‌లో 12క్వింటాళ్ల కారం అమ్మారు. ఏటా రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.