
ముస్లిం కుటుంబాలకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. హిందువులైన కజిన్ సోదరులను వారు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒక వీడియో విడుదల చేశారు. తమ కుటుంబాల నుంచి హాని ఉన్నదని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఛతర్పూర్లోని నౌగావ్ ప్రాంతానికి చెందిన ముస్లిం కజిన్ సిస్టర్స్ ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యారు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడానికి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లిన వారిద్దరూ ఇళ్లకు తిరిగిరాలేదు.
కాగా, ఆందోళన చెందిన యువతుల కుటుంబాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి కిడ్నాప్పై పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు.
మరోవైపు ఫిబ్రవరి 15న ఇద్దరు ముస్లిం యువతులు ఒక వీడియో రిలీజ్ చేశారు. హిందువులైన కజిన్ సోదరులను తమ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఎవరి ఒత్తిడి లేదన్నారు. తమకు రక్షణ కల్పించాలని, అత్తమామలను వేధించవద్దని జిల్లా ఎస్పీని వేడుకున్నారు. తమకు లేదా భర్తల కుటుంబాలకు ఏదైనా జరిగితే, తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను బాధ్యులుగా చేయాలని ముస్లిం కజిన్ సిస్టర్స్ అన్నారు.
అయితే ఆ ఇద్దరు ముస్లిం యువతులు మేజర్లని పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.




