
పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కు జర్మనీలో చేదు అనుభవం ఎదురైంది. మ్యూనిచ్ లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సుకు హాజరవ్వగా.. ఓ సెక్యూరిటీ అధికారి అడ్డుకుని ఐడీ కార్డు చూపించాలని అడిగారు. అయితే ఆయన ఐడీ కార్డును సరిగ్గా చూపించలేదని అభ్యంతరం వ్యక్తం చేయడంతో అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సదస్సులోపలికి వెళ్లే కొద్దిసేపటికి ముందే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మునీర్ మెడలో ఐడీకార్డు లేకపోవడంతో.. ఆయన్ను సెక్యూరిటీ అధికారి అడ్డుకున్నారు. పక్కనే ఉన్న మరో పాక్ సైనిక అధికారి తన వద్ద ఉన్న ఐడీకార్డు చూపడంతో లోపలికి అనుమతించారు. అంతర్జాతీయ వేదికలపై ఆయనకున్న గౌరవం ఇదేనా అంటూ పలువురు వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఆయన్ను ఇలాంటి సదస్సులకు ఆహ్వానించడమేంటని విమర్శిస్తున్నారు.
ఈ ఘటనపై జియే సింధ్ ముత్తాహిదా మహజ్ చైర్మన్ షఫీ బుర్ఫత్ స్పందించారు. ఇలాంటి వేదికలకు మునీర్ ను ఆహ్వానించడం .. పాక్ లో అణచివేతకు గురవుతున్న సింధీ, బలూచ్, పష్తూన్ వర్గాలను అవమానించడమేనన్నారు. పాక్ రాజకీయాలు, న్యాయవ్యవస్థ, మీడియాను సైనిక బూట్ల కింద నలిపేస్తున్నా.. మునీర్ స్పందించట్లేదని అసహనం వ్యక్తం చేశారు.





