
పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమం ఇజ్రాయెల్లోనూ నినదించింది. ఇక్కడి మోషావ్ నెవాతిమ్ ప్రాంతంలో దాదాపు 300 మొక్కలను నాటి ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. యూదుల పర్యావరణ దినోత్సవమైన ‘తు బిష్వత్’ పండుగను పురస్కరించుకుని ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
భారత రాయబార కార్యాలయం, ‘కెరెన్ కైమెట్ లెయిజ్రాయెల్’, స్థానిక సంస్థల సహకారంతో ఈ ఈవెంట్ను నిర్వహించారు. వందలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం.. పర్యావరణంపై భారత్, ఇజ్రాయెల్ దేశాలకున్న నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ రామి రోజెన్, ఇజ్రాయెల్లో భారత రాయబారి జెపి సింగ్, బిన్నీ షిమోన్ ప్రాంతీయ మండలి అధిపతి నిర్ జమీర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి, ప్రకృతి సంరక్షణలో భారత్-ఇజ్రాయెల్ దేశాలు ఒకే బాటలో పయనిస్తున్నాయని కొనియాడారు. కేవలం సాంకేతిక రంగంలోనే కాకుండా, భూగోళాన్ని రక్షించే బాధ్యతలో కూడా ఇరు దేశాలు భాగస్వాములు కావడం గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు. భారత రాయబారి జెపి సింగ్ మాట్లాడుతూ ‘తు బిష్వత్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. ఈ రెండూ ప్రకృతితో సమాజాన్ని ఏకంచేసే గొప్ప సంప్రదాయాలు’ అని అన్నారు. నేడు నాటిన ఈ మొక్కలు రాబోయే తరాలకు భారత్-ఇజ్రాయెల్ స్నేహానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాతావరణ మార్పులు, పర్యావరణ రంగాలలో సహకారం అందుతోందని, ప్రకృతిని కాపాడుకోవడం అంటే జీవరాశిని కాపాడుకోవడమేనని ఇజ్రాయెల్ అధికారులు అన్నారు. కాగా ఈ కార్యక్రమం జరిగిన ‘మోషావ్ నెవాతిమ్’ ప్రాంతానికి ఒక ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఇది కేరళలోని కొచ్చిన్ నుండి వలస వెళ్లిన భారతీయ యూదులచే స్థాపితమయ్యింది. ఇక్కడ కొచ్చిన్ శైలిలో నిర్మించిన ప్రార్థనా మందిరం (సినగోగ్), భారతీయ యూదుల వారసత్వ కేంద్రం నేటికీ భారతీయ సంస్కృతిని చాటిచెబుతున్నాయి.





