News

ఆస్ట్రేలియాలో గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

125views

ఆస్ట్రేలియాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మెల్‌బోర్న్‌లో భారతీయులు అధికంగా నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేసిన గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్ చేసిన వారిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. దొంగతనానికి గురైన విగ్రహాన్ని కనుగొని.. బాధ్యులను వదలొద్దని ఢిల్లీలోని ఆస్ట్రేలియా దౌత్యాధికారులకు తేల్చి చెప్పింది. మెల్‌బోర్న్‌లో భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే రోవ్‌విల్లే ప్రాంతంలోని గాంధీ కాంస్య విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. అంతటితో ఊరుకోకుండా విగ్రహాన్ని పాదాలు మాత్రమే ఉంచి.. కాళ్ల వరకు కట్ చేసి ఎత్తుకెళ్లారు అగంతకులు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఇండియన్ కమ్యూనిటీ స్థానిక విక్టోరియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. గాంధీ విగ్రహాన్ని ధ్వంస చేయడం, ఎత్తుకెళ్లడాన్ని ఖండించారు.

‘మెల్‌బోర్న్‌లో భారత కమ్యూనిటీ నివసించే ప్రాంతంలోని గాంధీ కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై సత్వరమే చర్యలు తీసుకోవాలని, అపహరణకు గురైన విగ్రహాన్ని త్వరగా కనిపెట్టాలని ఆస్ట్రేలియా అధికారులను కోరాం’ అని జైస్వాల్ వెల్లడించారు. అయితే.. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. అహింసావాది గాంధీ కాంస్య విగ్రహాన్ని రోవ్‌విల్లేలో 2021 నవంబర్ 12వ తేదీన అప్పటి ప్రధాని స్కాట్ మోరిసన్ ఆవిష్కరించారు.