
వాస్తవానికి భారతదేశానికి చిత్తడి నేలలు అనేవి ఈ మధ్య కాలంలో పర్యావరణవేత్తలు కనిపెట్టిన కొత్త విషయమేమీ కాదు; అవి మన నాగరికతకే పునాదులు. ప్రపంచ దేశాల మధ్య ఒప్పందాలు రాక వేల ఏళ్ల ముందే.. భారతీయులు చెరువులు, సరస్సులు, కోనేరులు, కాలువలు మరియు పవిత్ర నదులను ఒకదానికొకటి అనుసంధానం చేసి అద్భుతమైన నీటి వ్యవస్థలను నిర్మించారు. ఈ చిత్తడి నేలలు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు; అవి మన సామాజిక మరియు ఆధ్యాత్మిక జీవనంలో భాగం. వ్యవసాయం బాగుండాలని, కరువు రాకూడదని ఆనాడు గ్రామాలు, దేవాలయాలు మరియు రాజులు కలిసి ఈ నీటి వ్యవస్థలను ఎంతో బాధ్యతగా కాపాడేవారు.
భారతదేశపు నీటి నాగరికతలో అత్యంత గొప్ప చారిత్రక కట్టడం ‘కల్లనై’ (గ్రాండ్ అనికట్) ఆనకట్ట. దీనిని సా.శ.2వ శతాబ్దంలోనే కరికాల చోళుడు తమిళనాడులోని కావేరి నదిపై నిర్మించారు. భారీ అన్-హ్యూన్ (చెక్కినవి కాని) రాళ్లను ఉపయోగించి నిర్మించిన ఈ ఆనకట్ట, నది నీటిని సాగు కాలువల్లోకి మళ్లించింది. దీనివల్లే కావేరి డెల్టా ప్రాంతం దక్షిణ ఆసియాలోనే అత్యంత సారవంతమైన వ్యవసాయ ప్రాంతాలలో ఒకటిగా మారింది. దాదాపు రెండు వేల ఏళ్ల క్రితమే భారతీయులు సాధించిన ఉన్నత స్థాయి హైడ్రాలిక్ ఇంజనీరింగ్కు ఈ ఆనకట్ట నిదర్శనం. ప్రపంచంలోనే ఇప్పటికీ నిరంతరంగా వాడుకలో ఉన్న పురాతన ఆనకట్టలలో కల్లనై ఒకటి.
కల్లనై అనేది కేవలం ఒక ఆనకట్ట మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ నాగరికత వ్యవస్థ. ఇది వరదలను నియంత్రించింది. లక్షలాది మంది రైతులకు సాగునీరు అందిస్తూ.. అండగా నిలిచింది. స్థానిక ప్రజల ఆధ్వర్యంలో నడిచే చెరువులు, కాలువల నెట్వర్క్కు ఇది మూలస్తంభంగా నిలిచింది. చోళ సామ్రాజ్యం అత్యంత వ్యవస్థీకృత నీటి పారుదల పాలనను అభివృద్ధి చేసింది. చోళ రాజులు నీటి నిర్వహణను గ్రామ స్వపరిపాలనతో మరియు ఆలయ వ్యవస్థలతో అనుసంధానించి ఒక అద్భుతమైన పాలనను సాగించారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వమే కాకుండా, ప్రజలందరికీ పంచిన ఈ వికేంద్రీకరణ విధానమే.. మన నాగరికత కొన్ని శతాబ్దాల పాటు వర్ధిల్లడానికి ప్రధాన కారణం.
చిత్తడి నేలల ప్రాముఖ్యతను ఆధునిక ప్రపంచం 20వ శతాబ్దం చివరలో మాత్రమే గుర్తించింది. వీటిని కాపాడుకోవడానికి, సరిగ్గా వినియోగించుకోవడానికి దేశాల మధ్య సహకారం ఉండాలని 1971లో ‘రామ్సర్ ఒప్పందం’ కుదిరింది. జీవవైవిధ్యం, నీటి భద్రత మరియు వాతావరణ మార్పులను తట్టుకోవడంలో ఈ నేలలు ఎంత కీలకమో ఈ ఒప్పందం నొక్కి చెప్పింది. భారత్ 1982లో ఈ ఒప్పందంలో చేరింది. వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు స్థానికంగా కాపాడిన ఈ నీటి వనరులను, నేడు మనం ‘రామ్సర్ సైట్లు’గా గుర్తిస్తూ మళ్ళీ వాటి విలువను తెలుసుకుంటున్నాము.
అందుకే ఫిబ్రవరి 2 అనేది కేవలం పర్యావరణానికి సంబంధించిన ఒక సాధారణ రోజు మాత్రమే కాదు. ఇది ఒక గొప్ప సత్యాన్ని మనకు గుర్తుచేస్తుంది. ‘ఎవరైతే నీటిని గౌరవించి, సరిగ్గా నిర్వహించగలరో.. వారే చరిత్రను సృష్టించగలరు.’ కల్లనై రాతి ఇంజనీరింగ్ కట్టడం నుంచి ఆలయ కోనేరులు, పవిత్ర నదులు, ఊరి చెరువుల వరకు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం వీటికి పేర్లు పెట్టకముందే భారత్ ఒక గొప్ప ‘నీటి నాగరికత'(చిత్తడి నేలల నాగరికత)ను నిర్మించింది. నేడు ప్రపంచ దేశాలు నీటి కొరతతో, వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. స్థిరమైన జీవనం (Sustainability) అనేది 1971లో పుట్టిన కొత్త ఆలోచన కాదని, అది వేల ఏళ్ల క్రితమే భారతదేశం ఆచరించి చూపిన జీవన విధానమని ఫిబ్రవరి 2 మనకు గుర్తుచేస్తోంది.





