News

బలూచ్ ప్రజలపై పాక్‌ బలగాల పిరికిపంద చర్యలు

134views

పాకిస్తాన్‌ గడ్డ మీద బెలూచిస్తాన్‌లో పరిణామాలు మళ్లీ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాయి. బెలూచ్‌ రెబల్స్‌ పాక్‌ బలగాలపై అనూహ్య రీతిలో దాడులు జరపడం.. ఆ ఆత్మాహుతి దాడులు జరిపిన వాళ్లలో ఇద్దరు మహిళలు ఉండడం, ఇరువైపులా భారీగా ప్రాణనష్టం సంభవించడం!.. ఇవన్నీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ధురందర్‌ సినిమా చూసిన వాళ్లకు పాక్‌లో బలూచ్‌లు ఎదుర్కొనే వివక్ష గురించి ఓ ఐడియా ఉండొచ్చు. అయితే.. వాస్తవంలోనూ బలూచ్‌ ప్రజలు తమ అణచివేతకు వ్యతిరేకంగా నిలబడి.. స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో.. మహిళా ఫిదాయిన్‌ల త్యాగం చర్చనీయాంశంగా మారింది.

పాక్‌ బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బెలూచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన ‘ఆపరేషన్ హెరోఫ్ – ఫేజ్ II’.. దానికి కౌంటర్‌గా పాక్‌ ఆర్మీ జరిపిన దాడులు 40 గంటలకుపైనే కొనసాగాయి. ఈ ఆపరేషన్‌లో పాక్‌ సైన్యాన్ని, ఫ్రంట్‌ వారియర్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు మహిళా ఫిదాయీన్లు పాల్గొన్నారని బీఎల్‌ఏ ప్రకటించింది. ‘‘ఖరాన్, మస్తుంగ్, టంప్, పస్ని ప్రాంతాల్లో మా ఆపరేషన్లు పూర్తయ్యాయి. క్వెట్టా, నోష్కీ ప్రాంతాల్లో కూడా మా యోధులు ఉన్నారు. అక్కడి పాక్‌ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. దాడుల్లో మొత్తం 200 మంది పాక్‌ సైనికులు మరణించారు. బలూచ్‌ ప్రజల్లారా.. పాక్‌ సైన్యానికి దూరంగా ఉండండి. మా పోరాటానికి మద్దతు ప్రకటించండి’’ అంటూ బీఎల్‌ఏ ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే పాక్‌ ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను తక్కువగా చేసి చెబుతోంది. పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. మహిళలే ఆత్మాహుతి దాడులు జరిపారని చెబుతూ.. శుక్రవారం 41 మంది, శనివారం 92 మంది బీఎల్‌ఏ రెబల్స్‌ హతమయ్యారని ప్రకటించారు. నోష్కీ, హబ్, చమన్, నసీరాబాద్, గ్వాదర్, మక్రాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని అన్నారు. బెలూచిస్తాన్‌ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ.. బీఎల్‌ఏ రెబల్స్‌ జరిపిన దాడుల్లో 17 భద్రతా సిబ్బంది, 31 పౌరులు మరణించారన్నారు. పాకిస్తాన్ సైన్యం 40 గంటలపాటు ప్రతిదాడి చేసి 140కి పైగా మిలిటెంట్లను హతమార్చినట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటిస్తే.. బీఎల్‌ఏ మాత్రం 18 మంది మాత్రమే తమ యోధులు మరణించారని, ఇందులో 11 మంది ఆత్మాహుతి దాడుల్లోనే వీరమరణం పొందారని ప్రకటించుకుంది.

Fidayeen” (ఫిదాయీన్) అనే పదం అరబిక్ మూలం నుంచి వచ్చింది. అర్థం తన ప్రాణాలను త్యాగం చేసే వ్యక్తి లేదంటే ఆత్మాహుతి యోధుడు/యోధురాలు అని..

ఇదే మొదటిది కాదు.. !
ఈ తరహా మహిళా మానవ బాంబు దాడులకు (fidayeen strike) దిగడం బలూచ్‌ రెబల్‌ గ్రూప్స్‌కు తొలిసారేం కాదు. బెలూచ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ తరఫున జరీనా రఫీయా అలియాస్‌ ట్రాంగ్‌ మహూ అనే సూసైడ్‌ బాంబర్‌ ఆ మధ్య చగయ్‌ సమీపంలో చైనా మైనింగ్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో చైనాకు ఆస్తినష్టం జరపడంతో పాటు ఆరుగురు పాక్‌ సైనికులు మరణించారు.

తాజా దాడుల్లో.. 24 ఏళ్ల ఆసిఫా మంగళ్ తోపాటు మరో యోధురాలు పాల్గొన్నట్లు బీఎల్‌ఏ ప్రకటించుకుంది. నోష్కీలోని ఐఎస్‌ఐ ప్రధాన కార్యాలయంపై వాహన బాంబుతో ఆసిఫా, మరో మహిళా యోధురాలు హవా బలోచ్ గ్వాదర్ ఫ్రంట్‌లో పోరాడి మరణించిందని తెలిపింది. వాళ్ల ఫొటోలు, దాడికి ముందు వాళ్ల ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని కూడా విడుదల చేసింది.

పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్‌ (సుమారు 44% భూభాగం). అయితే.. పంజాబీలు, పశ్తూన్లు వంటి జాతులు పాక్‌ రాజకీయ, సైనిక, ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కేవలం ఆరు శాతం జనాభా ఉన్న మైనారిటీ వర్గం బలూచ్‌.. సొంత గడ్డపై అన్నివిధాలుగా తీవ్ర అణచివేతకు గురవుతోంది. అదే సమయంలో గ్యాస్, ఖనిజ ఆర్థిక వనరులతో పాటు గ్వాదర్ పోర్ట్ విషయంలోనూ పాక్‌ ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని.. స్థానికులైన తమకు తగిన లాభాలు అందడం లేదంటూ ఆ జాతి వాదిస్తోంది. వెరసి తమ హక్కుల కోసం తిరుగుబాట్లు, ఉద్యమాలు చేస్తున్నారు.