
బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహ్మద్ యూనస్పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన దేశాన్ని అరాచకంలోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని అన్నారు. దక్షిణాసియా ఫారెన్ కరస్పాండెంట్స్ క్లబ్ దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఒకప్పుడు శాంతియుత దేశంగా ఉన్న బంగ్లాదేశ్.. ఇప్పుడు తీవ్ర హింస, భయం, విధ్వంసాన్ని ఎదుర్కొంటోందన్నారు.
‘‘బంగ్లాదేశ్లో గతేడాది ఆగస్టులో జరిగిన కుట్ర తర్వాత దేశం భయాందోళనలకు గురైంది. ఎక్కడ చూసినా అణచివేత. స్వేచ్ఛ కనుమరుగైంది. సంస్థలు బలహీనపడ్డాయి. మతతత్వ శక్తులు రెచ్చిపోతున్నాయి. మహిళలపై హింస, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయి. దేశం భయంతో నిండిపోయింది. బంగ్లాదేశ్ నేడు రక్తంతో తడిసిన ప్రాంతంగా మారింది. ఇటువంటి సంక్షోభ సమయంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, హింసాత్మక పాలనకు ముగింపు పలికేందుకు పోరాటం చేయాలి’’ అని షేక్ హసీనా పిలుపునిచ్చారు.





