News

ఆసిమ్ మునీర్ భారత్‌తో యుద్ధానికి ఆరాటపడుతున్నాడు.. ఇమ్రాన్ ఖాన్ సోదరి

115views

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ కొద్దిరోజులుగా జోరుగా వదంతులు నడిచాయి. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆధ్వర్యంలో హత్య జరిగిందంటూ పుకార్లు నడిచాయి. ఉద్రిక్తతలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు కలిసేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. దీంతో జైల్లో చూసొచ్చాక తన సోదరుడు బాగానే ఉన్నాడని.. మానసికంగా వేధిస్తున్నారని సోదరి ఉజ్మా ఖానుమ్ ఆరోపించారు. మొత్తానికి క్షేమంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చింది.

తాజాగా ఇమ్రాన్ ఖాన్ మరో సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసిమ్ మునీర్ భారతదేశంతో యుద్ధానికి ఆరాటపడుతున్నాడని ఆరోపించింది. అసిమ్ మునీర్ చాలా తీవ్రవాద ఇస్లామిస్ అని.. భారతదేశంతో యుద్ధం కోసం తహతహలాడాడని చెప్పుకొచ్చింది. తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ ‘‘స్వచ్ఛమైన ఉదారవాది’’, అని.. భారతదేశంతో స్నేహం చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ భారతదేశంతో.. బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది. మునీర్ కారణంగానే మే నెలలో భారతదేశంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు. మునీర్ కారణంగా భారతదేశ మిత్రదేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్‌ను విడిపించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నం చేయాలని అలీమా విజ్ఞప్తి చేశారు.

జైలులో ఇమ్రాన్ ఖాన్..
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అనేక కేసుల్లో దోషిగా తేలిన తర్వాత ఆగస్టు 2023 నుంచి జైలులో ఉన్నారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు . గత కొన్ని రోజులుగా హత్యకు గురయ్యారంటూ పుకార్లు వచ్చాయి. నెలకు పైగా కలవడానికి కుటుంబానికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వదంతులు వ్యాపించాయి.