News

రాజ్ భవన్ పేరు మార్పుపై వివాదం..

60views

తమిళనాడులో మరోసారి గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం మొదలైంది. గవర్నర్ అధికార నివాసమైన ‘‘రాజ్ భవన్’’ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చాలనే ప్రతిపాదనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ పేరు మార్పు సిఫార్సు చేశారు. దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఈ సమస్య పేర్ల గురించి కాదని, ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం గురించి అని అన్నారు. ఈ పేరు మార్పులు అనవసరమని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల అధికారాన్ని గౌరవించడంలో నిజమైన జవాబుదారీతనం ఉందని చెప్పారు.

‘‘పేరు మార్చడం మనస్తత్వాన్ని మార్చడం కంటే ముఖ్యమైంది కాదు. శాసన సభ = ప్రజల సభ. శాసనసభను గౌరవించని వారు, లోక్‌ భవన్‌గా పేరు మార్చడం కంటితుడుపు చర్య.’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే సార్వభౌమ శాసనసభను గౌరవించడం ఈ కాలపు అవసరమని ఆయన అన్నారు. ఆలోచనలు, చర్యల్లో మార్పు లేకపోతే, ఇది కూడా అనవసరం అని అన్నారు. శాసనసభ పాత్రను సమర్థించని వారు గవర్నర్ నివాసం పేరు మార్చితే లాభమేంటని అన్నారు.

తమిళనాడుకు ముందు, పశ్చిమ బెంగాల్ గవర్నర్ CV ఆనంద బోస్ శనివారం కోల్‌కతాలోని రాజ్ భవన్ పేరును మార్చాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాన్ని అమలు చేశారు. డార్జిలింగ్ నివాసాన్ని లోక్ భవన్‌గా మార్చారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారానికి అనుగుణంగా పేరు మార్పు ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. ఇక అన్ని అధికారిక కార్యక్రమాల్లో పేరు మార్పు కనిపిస్తుంది.