
తమిళనాడులోని తిరుప్పూర్, కరువంపాలయం ప్రాంతంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రాజ గణపతి దేవాలయంలోకి ప్రవేశించిన ఒక ముస్లిం యువకుడు నమాజ్ చేయడం తీవ్ర వివాదానికి, ఉద్రిక్తతకు దారితీసింది. తిరుప్పూర్-మంగళం రోడ్డులోని సెంగుంతపురం వద్ద ఉన్న రాజ గణపతి దేవాలయంలో గత ఆదివారం (అక్టోబర్ 26) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పూచుకాడ్ నివాసి అయిన అజ్మల్ ఖాన్ (21) అనే యువకుడు ఆలయంలోకి వచ్చి.. అక్కడ భక్తులు ఉన్నప్పటికీ, గుడి ద్వారానికి ఎదురుగా.. వినాయకుడి విగ్రహానికి వెన్ను చూపి మరీ నమాజ్ చేశాడు.
ఈ చర్యను గమనించిన ఆలయ అర్చకుడు నాగనాథన్, భక్తులు వెంటనే అడ్డుకున్నారు. ఆలయం నుండి బయటకు వెళ్లాలని చెప్పగా.. ఆ యువకుడు ఆగ్రహించి అర్చకులతో గొడవకు దిగాడు. పరిస్థితి చేయి దాటడంతో అక్కడున్న భక్తులు కలిసి అతన్ని ఆలయం నుండి బయటకు పంపించారు. ఈ క్రమంలో ఆలయం వెలుపల కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువకుడు ఆలయం బయట కూడా అర్చకులు, భక్తులతో గొడవపడటంతో జనం గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో యువకుడు మద్యం మత్తులో ఈ పని చేసినట్లు తేలింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. “భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండటానికి యువకుడికి గట్టి హెచ్చరిక జారీ చేశామని, ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.