
అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ప్రజలు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చినట్లు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయ ప్రాజెక్టు మొత్తం ఖర్చు దాదాపు రూ.1,800 కోట్లని.. ఇప్పటి వరకూ రూ.1,500 కోట్ల బిల్లులు చెల్లించినట్లు వెల్లడించారు.
2022లో నిర్మాణం కోసం విరాళాలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తం వచ్చినట్లు తెలిపారు. నవంబరు 25న ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలకు దాతలందరినీ ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. ఆరోజు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని, రామాలయంపై పతాకాన్ని ఆవిష్కరిస్తారని వివరించారు. దాదాపు 8 వేల మందికిపైగా ఆహ్వానితులు ఇందులో పాల్గొంటారని ఆయన చెప్పారు.
మరోవైపు శ్రీరామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణం పూర్తయింది. ప్రధాన దేవాలయ ప్రాంగణంతోపాటు గణేశ, శివ, హనుమాన్, సూర్యనారాయణ, భగవతి, అన్నపూర్ణ, శేషావతార దేవాలయాల నిర్మాణం కూడా పూర్తయింది. ఈ వివరాలను శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం ఎక్స్ వేదికగా తెలిపింది. ధ్వజ స్తంభాలు, కలశాల స్థాపన కూడా జరిగినట్లు పేర్కొంది. ఇక్కడ నవంబరు 25న జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో ధ్వజారోహణ జరుగుతుందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామాలయంపై పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపింది.





