
వృత్తి నైపుణ్యం గల శ్రీవారి సేవకుల కోసం నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్ రూపొందించనున్నట్లు టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవన్లో వృత్తి నిపుణుల శ్రీవారి సేవపై జేఈవో వీరబ్రహ్మంతో కలిసి సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులను టిటిడిలోని ముఖ్యమైన పది విభాగాల్లో ఉపయోగించుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ‘ముఖ్యంగా సాంకేతిక విభాగాల్లో వారి సేవలు వినియోగించుకోనున్నాం. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టి తరువాత పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. త్వరలోనే దీనిపై నిర్దిష్ట విధానం రూపొందించి సుస్థిర వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. స్విమ్స్ సంచాలకులు డా.ఆర్.వి.రవికుమార్, బర్డ్ సంచాలకులు జగదీష్, సీఈ సత్యనారాయణ, ఐటీ జీఎం శేషారెడ్డి, సీఎంవో నర్మదా, డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, డీఈవో వెంకట సునీల్, గోశాల సంచాలకులు శ్రీనివాసులు, హెచ్డీపీపీ కార్యదర్శి రామ్ రఘునాథ్ పాల్గొన్నారు.





