
భారతీయ అమెరికన్ చిత్ర నిర్మాత మీరా నాయర్ కుమారుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్ ప్రైమరీలో విజయం సాధించి వార్తల్లో నిలిచాడు. 33 ఏళ్ల వయసు ఉన్న ఈ మమ్దానీ న్యూయార్క్ మేయర్గా విజయం సాధిస్తే, అమెరికాలో అతిపెద్ద నగరానికి తొలి ముస్లిం మేయర్గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. అయితే, గతంలో మమ్దానీ భారత్, భారత ప్రధాని నరేంద్రమోడీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారతీయులతో పాటు చాలా మంది అతడి కామెంట్స్ని తప్పుబడుతున్నారు.
2002 గుజరాత్ అల్లర్లపై ప్రధాని నరేంద్రమోడీపై ఆయన విమర్శలు చేశారు. ముస్లింలను తన సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి నిర్మూలించారని ఆరోపిస్తున్న పాత వీడియో మళ్లీ వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలపై భారతీయుల నుంచే కాకుండా, ఇండో అమెరికన్ కమ్యూనిటీ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో మమ్దానీ మాట్లాడుతూ.. 2002 అల్లర్లలో చాలా మంది మరణించారని, మనం ఇంకా ఉనికిలో ఉన్నామని కూడా ప్రజలు నమ్మడం లేదని అన్నారు.
మేయర్ ఎన్నికలకు ముందు జరిగిన అభ్యర్థుల ఫోరమ్లో, మేయర్ అభ్యర్థులు న్యూయార్క్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీతో కలిసి కనిపిస్తారా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో మమ్దానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పోల్చాడు. మోడీని నెతన్యాహూలాగే యుద్ధ నేరస్తుడిగా చూడాలని కోరాడు.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని మోడీకి, ఇతరులకు సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, గుజరాత్లో కొద్ది మంది ముస్లింలు మాత్రమే మిగిలి ఉన్నారని మమ్దానీ చేసిన వ్యాఖ్యలపై భారత్లోని ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. గుజరాత్ జనాభా లెక్కల ప్రకారం, 2011లో రాష్ట్ర జనాభాలో 10 శాతం ముస్లింలు ఉన్నారు. 2002 అల్లర్ల తర్వాత కూడా వీరి జనాభా పెరిగింది. రాజకీయ విశ్లేషకుడు ఒమర్ ఘాజీ మాట్లాడుతూ.. మమ్దానీ వ్యాక్యలు రెచ్చగొట్టేవిగా, తప్పుడువిగా ఉన్నాయని, ఇది గుజరాత్లోని 6 మిలియన్ల ముస్లిం జనాభా, వారి ఉనికిని తిరస్కరించేలా, అవమానించేలా ఉన్నాయని అన్నారు.





