News

అప్పన్న ఆలయంలో.. వరుస ఉత్సవాలు

281views

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయంలో గురువారం నుంచి వరుస ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు స్వామివారి దర్శన వేళలు, ఆర్జిత సేవల్లో మార్పులు చేసినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలిలా.. ఈ నెల 9వ తేదీ వరకు నమ్మాళ్వార్‌ తిరు నక్షత్రం పూజలు జరగనున్న నేపథ్యంలో రాత్రి 7గంటల తర్వాత భక్తులకు దర్శనాలు లభించవు. రాత్రి ఆరాధన టికెట్లు కూడా రద్దు చేశారు.

  • 10వ తేదీన నృసింహ జయంతి సందర్భంగా ఉదయం 8గంటల నుంచి విశేష పూజలు, నృసింహ హోమం జరుగుతాయి. సాయంత్రం 4గంటల నుంచి కృష్ణాపురం గోశాలలో నృసింహ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేపడతారు. ఈ కారణంగా ఆరోజు సాయంత్రం 5గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం లభించదు.
  • 11వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సింహాద్రినాథుడికి మూడో విడత చందన సమర్పణ జరుగుతుంది. ఈ సందర్భంగా విశేష పూజలు, ఆరాధనలు నిర్వహించాల్సి ఉన్నందున ఆ రోజు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో తెలియజేశారు.