
వామపక్ష కేరళ ప్రభుత్వాన్ని, సీఎం పినరయ్ విజయన్ ని విమర్శిస్తున్న మరునాదన్ మలయాళీ ఎడిటర్ షాజన్ స్కరియా సోమవారం రాత్రి అరెస్టయ్యారు. షాజన్ స్కరియా తరుచూ కేరళ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్నారు. అలాగే పినరయ్ ప్రభుత్వానికి ఇస్లామిస్టులతో వున్న బంధాన్ని కూడా ఎత్తి చూపుతున్న నేపథ్యంలోనే ఈ అరెస్ట్ జరిగిందన్న విమర్శలు భారీగా వస్తున్నాయి. అందుకే ఎడిటర్ షాజన్ స్కరియాను ప్రభుత్వం అరెస్ట్ చేయించిందన్న వాదనలు వస్తున్నాయి.
నిజానికి ఎరుమేలి నుంచి తిరువనంతపురం వరకూ పోలీసులు ఆయన్ను వెంబడించారు. చివరికి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి.. తాను డ్రెస్ వేసుకుంటానని చెప్పినా సరే… పోలీసులు అనుమతి కూడా ఇవ్వలేదని, అలాగే అరెస్ట్ చేశారని ఎడిటర్ షాజన్ స్కరియా ఆరోపించారు.
అయితే.. అరెస్ట్ అనంతరం పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనలు జరిగిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.
విడుదల తర్వాత ఎడిటర్ షాజన్ స్కరియా మాట్లాడుతూ… పోలీసులు కొందరు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని, వారి ప్రభావంలో వున్నారని మండిపడ్డారు. అలాగే జర్నలిస్టుల స్వేచ్ఛను పూర్తిగా పినరయ్ విజయన్ సర్కార్ హరిస్తోందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె చేసిన తప్పులను ఎత్తి చూపినందుకే విజయన్ సర్కార్ ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. పినరయ్ విజయన్ కుటుంబ పాలనను పెంచి పోషిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తాను ఎంతకైనా పోరాటం చేస్తానని ఎడిటర్ స్కరియా ప్రకటించారు. పరిపాలనలో ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి మహ్మద్ రియాస్ ప్రభావం విపరీతంగా పెరిగిపోతోందన్నారు.