
రాబోయే 24-36 గంటల్లో (నేడో, రేపో) భారతదేశం తమపై సైనిక దాడి చేస్తుందని పాకిస్థాన్ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అతలుల్లా తరార్ అన్నారు. ఈ విషయమై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. సైనిక చర్య కోసం భారత్.. పహల్గాం ఉగ్రదాడిని సాకుగా వాడుకోవాలని చూస్తోందన్నారు. భారత్ దాడి చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సైనిక దాడి తర్వాతి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని బుధవారం ఎక్స్లో పోస్టు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందించలేదు. త్రివిధ దళాలకు భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్న వార్తల నేపథ్యంలో తరార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, భారత్ దాడి చేస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఇస్లామాబాద్, లాహోర్ నగరాలను నో ఫ్లై జోన్గా ప్రకటించారు. ఈ రెండు నగరాల గగనతలంలో ఎలాంటి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఎగరకుండా ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు. పాకిస్థాన్లో రెగ్యులర్ విమాన సర్వీసులను కూడా తగ్గించినట్లు సమాచారం. పాక్ ఆక్రమిత కశ్మీరులోని గిల్గిట్, స్కర్దు వైపు వెళ్లే విమాన సర్వీసులను ప్రైవేటు విమాన సంస్థలు రద్దు చేశాయి. కాగా, పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ కూడా తరార్ చేసినటువంటి వ్యాఖ్యలే చేశారు. పాకిస్థాన్పై ఇండియా తప్పకుండా దాడి చేస్తుందని భావిస్తున్నానని చెప్పారు.




