
పార్లమెంటులో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలవుతున్న పలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. వీటిని ”ఓట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు”గా పేర్కొంది. ఇది కేవలం ఓటు బ్యాంకు ప్రయోజనాలను కాపాడుకోవడం, దేశంలో అల్లరి తరహా పరిస్థితి సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నమని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు.
వక్ఫ్ ఆస్తులను అక్రమించుకున్న ల్యాండ్ మాఫియాకు చెందిన వారు మాత్రమే కొత్త చట్టం వల్ల తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని భయపడుతున్నారని పూనావాలా అన్నారు. సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేయడాన్ని ప్రస్తావిస్తూ… ”ఇవి పిల్స్కు తక్కువ, ఓటు బ్యాంకు ప్రయోజనాలకు ఎక్కువ” అని అన్నారు. వక్ఫ్ చట్టాన్ని లీగల్గా సవాలు చేస్తున్న వారి వెనుక కాంగ్రెస్, ఏఐఎంఎంఎం, కొన్ని ముస్లిం సంస్థలు ఉన్నాయని చెప్పారు. కొత్త చట్టం సామాజిక న్యాయానికి, వక్ఫ్ ఆస్తుల సక్రమ నిర్వహణకు దోహదపడుతుందని వివరించారు. ఇది హిందూ-ముస్లిం అంశం కాదని, వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడాన్ని పలు ముస్లిం సంస్థలు, క్రైస్తవ సంస్థలు స్వాగతించాయని చెప్పారు. 1985లో షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిరాజనేందుకు పార్లమెంటును కాంగ్రెస్ ఉపయోగించుకుందని, ఇప్పుడు వెనుకబడిన, ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు బిల్లు ఆమోదిస్తే తిరిగి కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది అన్నారు.
కాగా, వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం సోమవారంనాడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై త్వరిగతగతిని విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని సీజేఐ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం అంగీకరించింది.





