News

గాంధీ కళాకృతులు భారత్‌కు అప్పగింత

415views

జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన కళాకృతులు, చారిత్రక డాక్యుమెంట్లను దిల్లీలోని గాంధీ జాతీయ మ్యూజియానికి దక్షిణాఫ్రికాకు చెందిన ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌ ట్రస్టు- గాంధీ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (పీఎస్‌టీ-జీడీటీ) అప్పగించింది. వాటిలో గాంధీ స్వయంగా నేసిన వస్త్రాలు, ఇతర కళాకృతులు, దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌లో ఆయన నివాసమున్న ప్రాంతానికి సంబంధించిన చారిత్రక డాక్యుమెంట్లు ఉన్నాయి.

‘మహాత్మా గాంధీకి సంబంధించిన కళాకృతులను, చారిత్రక డాక్యుమెంట్లను అప్పగించే కార్యక్రమంలో నేను పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. బాపు జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’ అని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

  • ట్రస్టు అప్పగించిన వాటిలో ఎరుపు అంచుతో ఉన్న కస్తూర్బా శారీ, జాకెట్, వస్త్రం ముక్క, గాంధీ లుంగీ ఉన్నాయి. ఇంకా గాంధీ కుమారుడు మణిలాల్‌ గాంధీతో వివాహం సందర్భంగా సుశీలాబెన్‌ ధరించిన కాటన్‌తో తయారుచేసిన దండ ఉంది.
  • డాక్యుమెంట్లలో ఫీనిక్స్‌లోని ట్రాన్స్‌ఫర్‌ డీడ్, ఫీనిక్స్‌ బ్యాలన్స్‌ షీట్, ఇండియన్‌ ఒపీనియన్‌ ట్రేడింగ్‌ ఖాతా, లాభనష్టాల ఖాతా, బ్యాలన్స్‌ షీట్, ఇండియన్‌ ఒపీనియన్‌ పబ్లిషర్‌ లైసెన్స్, ఫీనిక్స్‌లోని స్టేషనరీ లైసెన్స్‌ ఉన్నాయి. 1913లో వచ్చిన టెలిగ్రామ్‌లు, దేవదాస్‌ గాంధీకి, సుశీలాబెన్‌కు మణిలాల్‌ గాంధీ రాసిన లేఖలూ ఉన్నాయి.