News

ఛత్రపతి శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్టు

424views

ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగ్‌పూర్‌కు చెందిన జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్‌ను తెలంగాణలో అదుపులోకి తీసుకున్నట్టు మహారాష్ట్ర పోలీసులు బాంబే హైకోర్టుకు తెలిపారు. ప్రశాంత్ కోరట్కర్‌ బెయిలు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.పాటిల్ తన వాదనలు వినిపిస్తూ జర్నలిస్టును తెలంగాణలో అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

కోరట్కర్ తరపున వాదించిన న్యాయవాది సౌరభ్ ఘాగ్ మాట్లాడుతూ కోరట్కర్ అరెస్ట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కాగా, ప్రశాంత్ బెయిలు పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. కోరట్కర్‌ను కస్టడీలోకి తీసుకున్నామని, పోలీసు బృందం ఆయనను కొల్హాపూర్ తీసుకొస్తున్నట్టు కొల్లాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ తెలిపారు.

కొల్హాపూర్‌కు చెందిన చరిత్రకారుడు ఇంద్రజీత్ సావంత్‌ను బెదిరించడంతోపాటు ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీపై ప్రశాంత్ కోరట్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సావంత్‌తో జరిగిన ఆడియో సంభాషణ ఆధారంగా ఈ కేసు నమోదైంది. జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు ఇరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని కొల్హాపూర్‌లోని జునా రజ్వాడ్ పోలీస్ స్టేషన్‌లో సావంత్ ఫిర్యాదు చేశారు.