News

న్యూటన్‌ కంటే ముందే వేదాల్లో గ్రావిటీ: రాజస్థాన్‌ గవర్నర్‌

335views

రాజస్థాన్‌ గవర్నర్‌ హరిబాపు బాగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1687లో గురుత్వాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ గుర్తించడానికి చాలా పూర్వమే మన వేదాల్లో దాని గురించి ప్రస్తావన ఉందని అన్నారు జైపుర్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో బాగ్డే ఈవిధంగా వ్యాఖ్యానించారు.

‘‘పురాతన కాలం నుంచి భారత్‌ విజ్ఞాన కేంద్రంగా ఉంది. నలంద యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలకు దేశవిదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. డెసిమల్‌ వ్యవస్థను భారతే ప్రపంచానికి అందించింది. గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి న్యూటన్‌ చాలా ఆలస్యంగా చెప్పారు. అంతకంటే చాలా పూర్వమే మన వేదాల్లో గ్రావిటీని ప్రస్తావించారు. విద్యుత్‌, విమానాలు ఇలా చాలా అంశాలు మన చరిత్ర పుస్తకాలు, రుగ్వేదంలో పేర్కొన్నారు’’ అని గవర్నర్‌ తెలిపారు.

అయితే, మన జ్ఞానాన్ని అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయన్నారు. భారత పురాతన విజ్ఞానాన్ని చెరిపేసేందుకు కొంతమంది కుట్రలు చేశారని, 1190ల్లో నలంద లైబ్రరీ దహనమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. నేర్చుకోవడానికి షార్ట్‌కర్ట్స్‌ ఉండవని, మేధో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నిరంతరం పుస్తక పఠనం చేయాలని సూచించారు.