
ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ భారత్లోని మణిపుర్, కశ్మీర్ సమస్యలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిని భారత్ తరఫు ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తిప్పికొట్టారు. తమపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఇప్పటికే నిరూపితమైందని స్పష్టంచేశారు.
జెనీవాలో జరిగిన 58వ మానవ హక్కుల మండలిలో గ్లోబల్ అప్డేట్పై టర్క్ మాట్లాడారు. ‘మణిపుర్లో హింస, శాంతిస్థాపన వంటి పలు సమస్యలు పరిష్కరించడానికి వేగవంతంగా చర్చలు జరపాలని కోరుతున్నా. కశ్మీర్తో సహా పలు ప్రాంతాల్లో మానవ హక్కుల పరిరక్షకులు, స్వతంత్ర జర్నలిస్టులపై నిర్బంధ చట్టాలు విధించడం, పౌరులు తిరిగే ప్రాంతాలను వినియోగించుకోకుండా ఆంక్షలు పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా. భారత దేశానికి ప్రజాస్వామ్యం, సంస్థలు అతిపెద్ద బలం. అవి ఆ దేశ అభివృద్ధికి, వైవిధ్యానికి ఆధారం. ప్రజాస్వామ్యాన్ని సమాజంలోని అన్ని స్థాయిల్లోనూ పెంపొందించాల్సిన అవసరం ఉంది’ అని టర్క్ పేర్కొన్నారు.
దీనిపై అరిందమ్ బాగ్చీ స్పందిస్తూ.. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, శక్తివంతమైన దేశమని పేర్కొన్నారు. గ్లోబల్ అప్డేట్లో టర్క్ పేర్కొన్న నిరాధారమైన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో విరుద్ధంగా ఉన్నాయన్నారు. భారత్పై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని స్పష్టంచేశారు. గ్లోబల్ అప్డేట్లో ఇలాంటి తప్పుడు సమాచారం ఉండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇతరులు చేసే వ్యాఖ్యలనే చెప్పాలనేటట్లు టర్క్ తీరు ఉందని బాగ్చీ ఆక్షేపించారు.





