
తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించడం టీటీడీ ప్రథమ లక్ష్యమని, తిరుమలలోని హోటళ్ల యజమానులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్యచౌదరి చెప్పారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో హోటళ్ల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తిరుమలలోని అన్ని హోటళ్లు, తినుబండార కేంద్రాలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తినుబండారాల ఆవరణలో పరిశుభ్రత, పాటించాలని, నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తూ తిరుమల ఖ్యాతిని నిలబెట్టాలని సూచించారు. అనంతరం దుకాణదారులందరికీ ఎస్ఓపీ జాబితాను సిద్ధం చేయాలని, చెక్లిస్ట్ ఇవ్వాలని, ఏవైనా కొరత ఉంటే వాటిని సరిదిద్దేందుకు కొంత సమయం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్టేట్స్ అధికారి వెంకటేశ్వరులు, డిప్యూటీ ఈఓ హెల్త్ ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్, వీజీఓలు రామ్కుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.





