
సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాను అడ్డుకుంటామని హెచ్చరించాడు.
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ మహాకుంభ మేళాపై దాడులు చేసి భగ్నం చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా ‘చలో ప్రయాగ్రాజ్’కు పిలుపునిచ్చాడు. లఖ్నవూ, ప్రయాగ్రాజ్లోని విమానాశ్రయాల్లో ఖలిస్తానీ, కశ్మీరీ జెండాలను ఎగురవేయాలని ఆయన మద్దతుదారులను కోరాడు. ‘మహాకుంభ ప్రయాగ్రాజ్ 2025 యుద్ధభూమిగా మారుతుంది’ అంటూ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు.
కాగా, పన్నూన్ ఇలా బెదిరింపులకు పాల్పడటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ అనేక సార్లు ఇలాంటి హెచ్చరికలే చేశాడు. భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని వాటిలో సిక్కులు ప్రయాణించొద్దని, ఢిల్లీ ఎయిర్పోర్ట్ మూసివేస్తారని, అయోధ్య రామ మందిరం పునాదుల్ని పెకిలిస్తాం వంటి బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఉత్తరప్రదేశ్లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ ముస్తాబవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కుంభమేళాలో 45 కోట్లమంది భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరిచేం అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో పాల్గొనే భక్తుల సౌకర్యం కోసం 1,60,000 టెంట్లు, 1,50,000 మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తారు. 1,250 కిలోమీటర్ల పైప్లైనును సిద్ధం చేస్తున్నారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, 2 వేల సోలార్ లైట్లు, 3 లక్షల మొక్కలు ఏర్పాటవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ రిస్ట్బ్యాండ్స్, యాప్ ట్రాకింగ్లతో భక్తులను లెక్కిస్తారు.





