
గతంలో ఎన్నో సందర్భాలలో అవసరంలో ఉన్న ప్రయాణికులకు రైల్వే సహాయం చేసిన సంఘటలను మనం చూసుంటాం. అటువంటి సంఘటనే ఒకటి అజ్మీర్-సీల్దా ఎక్ప్ప్రెస్లో చోటుచేసుకుంది. వారణాశికి చెందిన శష్వాత్ అనే వ్యక్తి తల్లి షీలా పాండే అజ్మీర్-సీల్దా ఎక్ప్ప్రెస్లో ప్రయాణిస్తుంది. ఈ రైలు 12 గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తోంది. ఆమెను శష్వాత్ ఫోన్లో సంప్రదించటానికి ప్రయత్నించగా సాధ్యపడలేదు. తనకు సహాయం చేయమని ట్విట్టర్లో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ను, రైల్వే మంత్రిత్వ శాఖను శష్వాత్ అభ్యర్థించారు.

ఆ ట్వీట్పై స్పందించిన రైల్వే సేవవారు ఆమె టికెట్ పిఎన్ఆర్, ఫోన్ నంబర్ వివరాలు తెలుపని అడిగారు. ఆ వివరాలేవి తెలియవని, ఆమె ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం మొఘల్సరాయ్లోని పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్లో 29 తేదినాడు రైలు ఎక్కినట్లు తెలిపారు. వాటితోపాటు పేరు, టికెట్ బుక్ చేసిన ఫోన్ నంబర్ వంటి వివరాలు అందచేశారు. ఆ ట్వీట్ చేసిన కొద్దిసేపటి తరువాత అసన్సోల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. టీటీఈకి ఫోన్లో పరిస్థితిని వివరించామని, ఆయన సదరు మహళను కలసి తన కొడుకుతో ఫోన్లో మాట్లడించినట్లుగా పేర్కొన్నారు.
దీనికి కృతజ్ఞతగా శష్వాత్ ట్వీట్ చేస్తూ ‘తక్షణం స్పందించి తనకు సహాయం చేసిన రైల్వేకి ధన్యవాదాలు’ అని తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వట్టర్ ఖాతాలో ఈ ఘటనను వివరిస్తూ ‘ప్రయాణికులపట్ల రైల్వే ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తుంది’ అని ట్వీట్ చేసింది. నెటిజన్లు ఇండియన్ రైల్వేను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.





