News

జనవరి 15 నుంచి భారత నౌకాదళంలోకి మూడు స్వదేశీ యుద్ధనౌకలు

408views

భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. నీలగిరి, సూరత్, వాఘ్‌షీర్ అనే దేశీయంగా నిర్మించిన మూడు యుద్ధనౌకలు ఇండియన్ నేవీకి అందుబాటులోకి రానున్నాయి. వాటిని ఈ నెల 15న ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో భారత నౌకాదళంలోకి ప్రవేశపెడతారు.

మూడు యుద్ధనౌకలను అందుబాటులోకి తీసుకురావడం భారత నౌకాదళపు యుద్ధ సంసిద్ధతను మరింత మెరుగుపరుస్తుంది. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి, ఆత్మనిర్భరత సాధించడంలో భారతదేశం అద్వితీయమైన ప్రగతిని సాధిస్తోందనడానికి ఈ మూడు వార్ షిప్స్ నిదర్శనంగా నిలుస్తాయి.

నీలగిరి నౌకలో అత్యున్నత స్థాయి సాంకేతికతలు, స్టెల్త్ ఫీచర్లు ఉన్నాయి. సూరత్ నౌకలో అద్భుతమైన డిజైన్, అత్యుత్తమమైన సామర్థ్యాలూ ఉండేలా తీర్చిదిద్దారు. అత్యాధునికమైన ఏవియేషన్ సౌకర్యాలు సమకూర్చిన ఈ రెండు నౌకల మీదనుంచి పగటి పూట, రాత్రి పూట కూడా హెలికాప్టర్లను ప్రయోగించవచ్చు.

వాగీశ్వర్ అత్యంత మౌనంగా ఉండే జలాంతర్గామి. ప్రపంచంలో ఉన్న డీజెల్-ఎలక్ట్రిక్ క్షిపణులు అన్నింటిలోనూ అత్యంత వైవిధ్యభరితమైన జలాంతర్గామి. డీజెల్-ఎలక్ట్రిక్ రెండు రకాల ఇంధనాలతోనూ పనిచేస్తుంది. యాంటీ సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, సమాచార సేకరణ, ప్రాంత నిఘా, ఇంకా ఇతర ప్రత్యేక ఆపరేషన్లను తట్టుకునేలా ఉండేలా డిజైన్ చేసారు. ఇంకా వాఘ్‌షీర్ మీద వైర్-గైడెడ్ టార్పిడోలు, యాంటీ షిప్ మిసైల్స్, అడ్వాన్స్డ్ సోనార్ సిస్టమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

ఈ మూడు ఓడలనూ పూర్తిగా దేశీయంగా ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌లో నిర్మించారు. భారతదేశపు పెరుగుతున్న స్వయంసమృద్ధి, ఆత్మనిర్భరతకు ఇది నిదర్శనం అని ఇండియన్ నేవీ పేర్కొంది. అంతేకాదు. ఈ మూడు షిప్‌లూ దేశీయంగా యుద్ధనౌకల డిజైనింగ్, నిర్మాణంలో వేగవంతమైన ప్రగతికి నిదర్శనాలు. రక్షణ ఉత్పత్తుల రంగంలో ప్రపంచ నాయకత్వ స్థాయికి భారత్ ఎదుగుదలకు సాక్ష్యాలు.