News

కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

257views

కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. కూచిపూడిలోని కళాక్షేత్రాన్ని ఆయన పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. కూచిపూడి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కూచిపూడి హెరిటేజ్‌ ఆర్ట్స్‌ సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా, ఏపీ స్టేట్‌ క్రియేటివిటీ అండ్‌ కల్చర్‌ కమిషన్‌, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ నెల 27వ తేదీన ప్రారంభోత్సవంతో 29 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున అధికారులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చేందుకు రష్యా, కెనడా, అమెరికా, జపాన్‌, జర్మనీ నుంచి కళాకారులు తరలి వస్తున్నారని తెలిపారు. ఈ నెల 29న రెండు వేల మందికి పైగా కళాకారులతో మహా బృంద నృత్యం ఉంటుందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడికి గుర్తింపు తీసుకొచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.