
బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలను, దేవతా విగ్రహాలను ముస్లిం ఛాందసులు ధ్వంసం చేయడాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ డిమాండ్ చేశారు. ఒకప్పుడు బంగ్లాదేశ్లో ప్రతి మూల నుంచి కూడా కాళికా మాత కీర్తనలు వినిపించేవని, నేడు అదే స్థలంలో కాళీ మాత దేవాలయాలను కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కూడా మూడు విగ్రహాలు ధ్వంసమయ్యాయని, వీటిని ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. అలాగే హిందువులపై కూడా హింస ఆపాలన్నారు.
షాకూర్ ప్రాంతంలో హిందూ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసినట్లు అక్కడి వారు ప్రకటించారు. అజర్హుల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని బంగ్లాదేశ్ పోలీసులు ప్రకటించారు.దేవాలయాల విధ్వంసం, హిందువులపై దాడులను బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, వీటిని అరికట్టడానికి అన్ని చర్యలను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.





