
శబరిమలలో అయ్యప్ప మండల పూజ కోసం ‘తంకా అంకి’ (బంగారు ఆభరణాలు) తీసుకెళ్లే ఉత్సవ ఊరేగింపు ఆదివారం పతనంతిట్టలోని అరన్ములలోని పార్థసారథి ఆలయం నుంచి బయలుదేరింది. ఈ నెల 25వ తేదీ(బుధవారం) వరకు ఈ తంకా అంకి ఊరేగింపు కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు అలంకరించి, ఆ తర్వాత దీపారాధన చేస్తారు. దీంతో తంకా అంకి కార్యక్రమం ముగుస్తుంది.
మార్మోగిన అయ్యప్ప నామం
పార్థసారథి ఆలయంలో ఆదివారం ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య తంకా అంకిని దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం కల్పించారు. అనంతరం 7 గంటల సమయంలో తంకా అంకి ఊరేగింపు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు, ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) అధికారులు పాల్గొన్నారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ మంత్రాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ కూడా పాల్గొన్నారు.
‘బుధవారం నాటికి అయ్యప్ప సన్నిధానానికి చేరిక’
“ఆదివారం ఉదయం పార్థసారధి ఆలయం నుంచి తంకా అంకి ఊరేగింపు ప్రారంభమైంది. మార్గంలో 74 ఆలయాల దగ్గర ఈ ఊరేగింపు ఆగుతుంది. డిసెంబర్ 25 నాటికి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ ఉత్సవ ఊరేగింపు పంబాకు చేరుకోగానే దేవస్వమ్ మంత్రి వీఎన్ వాసవన్ స్వాగతం పలుకుతారు.” అని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.
ట్రావెన్ కోర్ దేవస్థానం ఇచ్చిన ఆభరణాలు
శబరిమలలో నిర్వహించే మండల పూజ కోసం ఉపయోగించే ‘తంకా అంకి’ ఊరేగింపు అయ్యప్ప భక్తులకు చాలా ముఖ్యమైనది. శబరిమల పుణ్యక్షేత్రంలో కొలువైన అయ్యప్ప విగ్రహానికి అలంకరించే పవిత్ర బంగారు ఆభరణాలే తంకా అంకి. 1970వ దశకంలో 453 సవర్ల బరువున్న బంగారు ఆభరణాలను ట్రావెన్ కోర్ సంస్థానం అయ్యప్పకు సమర్పించింది.
ఉరేగింపుగా అయ్యప్ప ఆలయానికి
అయ్యప్పకు సమర్పించే బంగారు ఆభరణాలను అరన్ముల పార్థసారథి ఆలయంలో భద్రపరుస్తారు. మండలం, మకరవిళక్కు సమయంలో శబరిమల అయ్యప్ప సన్నిధానానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. డిసెంబరు 22న ప్రారంభమైన తంకా అంకి ఉత్సవ ఊరేగింపు డిసెంబరు 25తో ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం హారతికి ముందు అయ్యప్పకు బంగారు అభరణాలను అలంకరిస్తారు. ఆ తర్వాత డిసెంబరు 26 మండల పూజ జరుగుతుంది.





