News

లక్షలాది రుద్రాక్షలు ధరించి ప్రయాగ్‌రాజ్‌కు..

286views

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025, జనవరి 13 నుంచి జరగబోయే మహాకుంభమేళాకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది రుద్రాక్షలు ధరించి ఇక్కడికి వచ్చిన ‘రుద్రాక్ష్ వాలే బాబా’ గీతానంద్ గిరి అందరినీ ఆకర్షిస్తున్నారు.

గీతానంద్ గిరి మీడియాతో మాట్లాడుతూ ‘నేను 12 ఏళ్లుగా రుద్రాక్ష ధారణ తపస్సు చేస్తూ వస్తున్నాను. ‘రుద్రాక్ష’ శివునికి ప్రీతికరమైనది. అలహాబాద్ అర్ధ కుంభమేళా నుంచి నేను రుద్రాక్షలు ధరించడం మొదలుపెట్టాను. నా తపస్సు రాబోయే అర్ధ కుంభమేళాతో ముగుస్తుంది. దీనికి ఇంకా ఆరేళ్లు మిగిలివుంది. నేను 11 కిలోల బరువు కలిగిన రుద్రాక్షలను తొలుత ధరించాను. ఇప్పుడు రుద్రాక్షల బరువు 45 కిలోలకు చేరింది. నేను మొత్తం 1.25 లక్షల ‘రుద్రాక్షలను ధరించాల్సి ఉంది. ఇది 925 దండలుగా వస్తుంది. తాను చేస్తున్న ఈ తపస్సు దేశంలో సనాతన ఉద్ధరణకేనని గీతానంద్‌ గిరి తెలిపారు.

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించబోయే మహాకుంభమేళా కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదని, లక్షలాది మంది భక్తుల ఆధ్యాత్మిక, పవిత్ర మనోభావాలకు ఆధారమని పండితులు చెబుతున్నారు. కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు చేయడం ద్వారా ముక్తి లభిస్తుందని భక్తులు భావిస్తుంటారు. కుంభమేళా ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుండగా, మహాకుంభమేళా ప్రతి 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది.

ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళా. హిందువులు మహాకుంభమేళాను అత్యున్నతమైన ఉత్సవంగా భావిస్తారు. కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో జరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ప్రత్యేక ఖగోళ స్థితిలో ఉన్న సమయంలో కుంభమేళా నిర్వహిస్తారు. ఈ సమయంలో గంగా, క్షిప్రా, గోదావరి నదుల నీరు చాలా పవిత్రంగా మారుతుందని చెబుతుంటారు.