
మతం ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు కుదరదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. పశ్చిమ బెంగాల్లో కొన్ని ముస్లిం సముదాయాలకు ఓబీసీ కులాల హోదాను ఇచ్చి.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని తప్పుబట్టిన కోల్కతా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిముల్లోని 77 తరగతులకు పశ్చిమ బెంగాల్ రిజర్వేషన్ల చట్టం కింద, మరో 37 తరగతులకు పశ్చిమబెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం కింద 2010 నుంచి బెంగాల్ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తోంది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 22న కోల్కతా హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఆయా సముదాయాలను ఓబీసీలుగా గుర్తించడంలో వెనుకబాటుతనం కంటే మతమే ప్రధాన అంశంగా పని చేసినట్టు కనిపిస్తోందని తన తీర్పులో హైకోర్టు తెలిపింది. ముస్లిముల్లో వెనుకబడ్డాయంటూ కొన్ని తరగతులను ఎంపిక చేయడం మొత్తంగా ముస్లిం సమాజాన్ని అవమానించినట్టే అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ తరగతులకు రిజర్వేషన్ల కేటాయింపును నిలుపుదల చేసింది. దీనిని సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహా పలు సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. మతం ఆధారంగా కాక, వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకునే ఆయా సముదాయాలకు రిజర్వేషన్లు కేటాయించారని, కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని ఆయన కోరారు.





