
ప్రజా సంక్షేమం, గోమాత సంరక్షణ, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ రాజస్థాన్ లిక్మడేశ్వర్ యశ్నాజీ మహరాజ్ మట్ నుంచి సోమనాథ్జీ మహరాజ్, కన్నత్జీ మహరాజ్ అనే సాధువులు ప్రారంభించిన చార్ధామ్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలోని నగరికి చేరుకుంది. మున్సిపల్ పరిధిలోని కీళపట్టు చంద్రమౌళీశ్వర ఆలయంలో వారు బసచేశారు. ఆలయ నిర్వాహకులు వారికి బస ఏర్పాట్లుచేశారు. శనివారం ఉదయం చంద్రమౌళీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం చార్ధమ్ అని పిలవబడే నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక, పూరీ, రామేశ్వరంను, 12 జ్యోతిర్లింగాలను, సప్త నదులను, సప్తపురిని, పంచసరోవరాలను పాదయాత్రగా వెళ్లి దర్శించుకునేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన యాత్ర ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు రెండు ధామ్లు, నాలుగు జ్యోతిర్లింగాలు, నాలుగు పురులు దర్శించుకోవడం జరిగిందన్నారు. 4 వేల కిలోమీటర్ల మేర ప్రయాణం సాగిందన్నారు. 104వ రోజున నగరికి చేరుకున్నామని చెప్పారు. ప్రస్తుతం నగరి నుంచి 5వ పురి అయిన కాంచీపురానికి వెళ్తున్నట్లు చెప్పారు.





