65
రామ రావణ యుద్ధంలో లక్ష్మణ ప్రాణ ప్రదాత హనుమంతుడని తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ కు చెందిన శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఉద్ఘాటించారు.
హనుమత్ జయంతి ఉత్సవాలు బుధవారం తిరుమలలో ఘనంగా ముగిశాయి.
నాదనీరాజనం, ఆకాశగంగ, జపాలి తీర్థంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ హనుమంతుడు ప్రతి కార్యాన్ని సున్నితంగా గమనించి ధర్మబద్ధంగా నిర్వహించేవాడని తెలిపారు. సుగ్రీవుడికి రాముడికి మైత్రి కల్పించింది హనుమంతుడని చెప్పారు. హనుమంతుడు దేహ బలం, బుద్ధి బలం కంటే సంస్కార బలం చాలా గొప్పదని నిరూపించాడని స్వామీజీ వివరించారు.
అనంతరం ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ స్వామీజీని శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు.