News

రామేశ్వరానికి పోటెత్తిన భక్తులు..

279views

చిత్తిరై అమావాస్య సందర్భంగా మంగళవారం రామేశ్వరం అగ్ని తీర్థం వద్ద భక్తులు పితృదేవతలకు తర్పణాలు వదిలేందుకు వేల సంఖ్యలో గుమికూడారు. రామనాథపురం జిల్లా రామేశ్వరం రామనాథస్వామి ఆలయం రావణ సంహారం తర్వాత శ్రీలంక నుంచి అయోధ్యకు బయలుదేరి వెళుతూ సీతారాములు దర్శించిన పుణ్యక్షేత్రంగా హిందువుల తీర్థమూర్తి స్థలంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల అమావాస్య రోజున తమ పితృదేవతలకు తర్పణాలు విడిచిపెడతారు. ఆ మేరకు మంగళవారం చిత్తిరై సర్వ అమావాస్య ను పురస్కరించుకుని వేలాదిమంది భక్తులు అగ్నితీర్థంలో పుణ్యస్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు వదిలారు. ఆ తర్వాత రామనాథస్వామివారి ఆలయానికి వెళ్ళి అంతర ప్రాకారంలోని 22 తీర్థ బావుల్లోని జలాలను శిరుస్సులపై చల్లుకున్నారు.

చివరగా రామనాథస్వామిని, పర్వతవర్థిని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో జిల్లా ఎస్పీ జి సతీష్‌ ఆదేశాల మేరకు అదనపు పోలీసు భద్రత కల్పించారు. సుమారు 50 మందికిపైగా పారిశుధ్య కార్మికులు తీర్థబావుల పరిసరాలను శుభ్రం చేసారు. భక్తులకు అక్కడక్కడా చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ, పానకం, తాగునీరు పంపిణీ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎండవేడి నుంచి కాపాడేలా మున్సిపాలిటీ అధికారులు తూర్పు ప్రవేశ ద్వారం వద్ద 500 మీటర్ల పొడవైన ప్లాస్టిక్‌ టార్పాలిన్‌తో తాత్కాలిక పందిరి కూడా నిర్మించారు. ఉత్సవాల సమయంలో అమావాస్య రోజుల్లో అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం ఎండవేడి అధికంగా ఉండటంతో మున్సిపల్‌ అధికారులు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. తూర్పు ప్రవేశద్వారం వద్ద ప్లాస్టిక్‌ టార్పాలిన్‌ పైకప్పుతో తాత్కాలిక పందిరిని నిర్మించడం పట్ల భక్తులు హర్షం ప్రకటించారు