భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. నీరు ఏర్పడటానికి అవసరమైన రెండు మూలకాల్లో ఇదొకటి. రెండోది ఆక్సిజన్. ‘‘భూమి మీద నీరు మొత్తాన్నీ సేకరించి, ఈ గ్రహంపైన పరిస్తే 3 కిలోమీటర్ల లోతైన నీటి పొర ఏర్పడుతుంది. శుక్ర గ్రహం విషయంలో ఇలాగే చేస్తే నీరంతా గాల్లోకి వెళ్లిపోతుంది. నేలమీద 3 సెంటీమీటర్ల లోతైన నీటి పొర మాత్రమే మిగులుతుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఎరిన్ కాంగి చెప్పారు. శుక్రుడిపై ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ గతంలో అనువైన వాతావరణమే ఉండేదని తెలిపారు.
తాజా అధ్యయనంలో కంప్యూటర్ సిమ్యులేషన్లను ఉపయోగించి అసలు విషయాన్ని కనుగొన్నట్లు చెప్పారు. శుక్రుడి ఎగువ వాతావరణంలో ఉన్న ఒక అణువు ఇందుకు కారణమని గుర్తించారు. కార్బన్ డైఆక్సైడ్తో నీరు కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది. దీన్ని హెచ్సీవో+గా అభివర్ణిస్తున్నారు. ఈ రేణువులకు ధనావేశం ఉండటం వల్ల వాతావరణంలోని ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ క్రమంలో హెచ్సీవో+ అణువులు.. రెండుగా విడిపోతాయి. ఈ ప్రక్రియలో హైడ్రోజన్ పరమాణువులు పూర్తిగా అంతరిక్షంలోకి జారుకుంటాయి. ఫలితంగా.. నీరు ఏర్పడటానికి అవసరమైన రెండు మూలకాల్లో ఒకటి అక్కడ లభ్యం కావడంలేదు.





