
అహోబిలంలో వార్షిక వసంతోత్సవాలు మంగళవారం వైభంగా ముగిశాయి. అదిగువ అహోబిల క్షేత్రంభక్తజన సంద్రంగా మారింది. ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి శ్రీ ప్రహ్లాదవరదస్వాములు మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా వచ్చారు. అక్కడ ఉత్సవమూర్తులను కొలువుంచి 108 కళశాలతో కళశస్థాపన చేసిన అనంతరం పంచామృతాలతో అభిషేకించి పట్టుపీతాంబరాలతో అలకరించారు. రాత్రి స్వామి వారు అశ్వవాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. సోమవారం అర్ధరాత్రి అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాలను ముగించి అవభృత స్నానం ఆచరించారు.
ఉత్సవ విశిష్టత..
వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మూడు రోజుల పాటు జరిపే ఉత్సవాలను వసంతోత్సవాలు అంటారు. ఉత్సవంలో స్వామికి చల్లటి గాలి వీచేలా సుగంధాన్ని వెదజల్లే పలు రకాల చెట్ల ప్రతిరూపాలతో అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దుతారు. సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల సీజనల్ మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు.





