
పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్ గౌరవ్ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు యాత్రలో భాగంగా పర్యాటకులు, భక్తులు తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు క్షేత్రాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
పర్యాటకులు సికింద్రాబాద్ స్టేషన్తో పాటు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో దివ్యదక్షిణ యాత్ర రైలులో ఎక్కడానికి, దిగడానికి అవకాశం ఉంటుందన్నారు. రైలులోనే ఉదయం అల్పాహారం, కాఫీ లేదా టీ, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందించనున్నట్టు పేర్కొన్నారు. జూన్ 2న తిరిగి వచ్చే ఈ రైలులో ఒకొక్కరికీ సెకండ్ క్లాస్ ఏసీలో రూ.28,450, థర్డ్ క్లాస్ ఏసీ రూ.21,900లు, స్లీపర్లో రూ.14,250లుగా చార్జీ ఖరారు చేసినట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు ఐఆర్సీటీసీ (సౌత్ సెంట్రల్జోన్) సికింద్రాబాద్ మొబైల్ నంబర్ 92814 95845, 92814 95843, 97013 60647లలో సంప్రదించవచ్చని సూచించారు.





