News

తవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహాలు

62views

అది హర్యానాలోని మనేసర్ సమీపంలోని బఘంకి గ్రామం. ఆ ఊర్లో ఉన్న ఓ వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణం చేయాలనుకున్నాడు. అందుకోసం.. ఓ జేసీబీని పురమాయించాడు. ఈ క్రమంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో సుమారు 400 సంవత్సరాల నాటివని అంచనా వేసిన మూడు కాంస్య విగ్రహాలు బయటపడ్డాయని ఏప్రిల్ 24న పోలీసులు తెలిపారు. పురాతన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని, నిర్మాణ పనులను నిలిపివేయమని యజమానికి చెప్పామని, ఆ స్థలంలో మరిన్ని విగ్రహాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి పురావస్తు శాఖ తవ్వకాలు జరపనుందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేసీబీ యంత్రంతో కొత్త ఇంటి పునాది తవ్వుతుండగా విగ్రహాలు లభ్యమయ్యాయి.

ప్రారంభంలో, ప్లాట్ యజమాని విగ్రహాల సమాచారాన్ని దాచడానికి ప్రయత్నించాడు. ఈ విషయం దాచడానికి JCB డ్రైవర్‌కు డబ్బు కూడా ఇచ్చాడు. అయితే డ్రైవర్ రెండు రోజుల తర్వాత బిలాస్‌పూర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని.. ఫ్లాట్ ఓనర్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ప్లాట్ యజమాని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న విగ్రహాల్లో నిలువెత్తు విష్ణుమూర్తి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, లక్ష్మీదేవి, విష్ణువుల ఉమ్మడి విగ్రహం ఉన్నట్లు వారు తెలిపారు. అయితే బంగారు నాణేల కుండ కూడా ఫ్లాట్ యజమానికి దొరికిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రాలేదని.. విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

ఈ విగ్రహాలను బిలాస్‌పూర్ పోలీసులు.. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ బనాని భట్టాచార్య, డాక్టర్ కుష్ ధేబర్‌లకు అప్పగించారు. విగ్రహాలు దొరికిన స్థలంలో గుడి నిర్మించాలని గ్రామస్తులు భావించి విగ్రహాలను పంచాయతీకి అప్పగించాలని కోరారు. అయితే వారి డిమాండ్‌ను పురావస్తు శాఖ అధికారులు తిరస్కరించారు.

‘‘ఈ విగ్రహాలు ప్రభుత్వ ఆస్తులు, వీటిపై ఎవరికీ వ్యక్తిగత హక్కులు ఉండవు. వీటిని మా లేబొరేటరీలో అధ్యయనం చేసిన తర్వాత పురావస్తు శాఖ మ్యూజియంలో ఉంచుతాం. ప్రాథమిక పరిశీలనలో ఈ విగ్రహాలు దాదాపు 400 ఏళ్ల నాటివిగా తెలుస్తోంది. ఈ ప్లాట్‌లో మళ్లీ తవ్వకాలు కూడా జరుగుతాయి” అని పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు.