
జమ్మూకశ్మీర్ నాడు, నేడు.. ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పునరుద్ఘాటించారు. ‘కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ యూనిటీ – 2024’ పేరుతో ఆదివారం బెంగళూరులో నిర్వహించిన సదస్సు ప్రారంభోపన్యాసం చేసిన ఆయన.. ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలకు ఎటువంటి అనుమానాలు తలెత్తకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకొంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘‘కశ్మీర్ భారత్లో అంతర్భాగం అయినప్పటికీ దేశ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అప్పుడే అది మరింత పటిష్ఠంగా ఉంటుంది. చెడ్డ మతమంటూ ఏదీ ఉండదు.. చెడు మన ఆలోచనల్లోనే ఉంటుంది. మనం ముందుకు వెళ్లాలంటే దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవడంతోపాటు ఒకరికొకరు అండగా నిలబడటం ఒక్కటే మార్గం. మనల్ని విభజించాలనుకునే శక్తులతో పోరాటం చేయాలి’’ అని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.





