News

ఆలయ నిర్వహణ అంతా.. అవకతవకలమయం!

308views

విశాఖపట్నం జిల్లా విశాఖ కాన్వెంట్‌ కూడలిలోని అచ్చియమ్మ ఎర్నిమాంబ ఆలయ నిర్వహణ తరచూ వివాదాస్పదమవుతోంది. గతంలో ఇక్కడ హుండీ చోరీ, అంతకుముందు హుండీ ఆదాయం లెక్కింపులో అవకతవకలు కలకలం రేపాయి. వారాంతాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకునే సమయంలోనే అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. కొబ్బరి కాయలు కొనుగోలు, మొక్కుబడులు చెల్లింపులకు భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. కొన్ని అంశాలపై దేవాదాయశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి.అధికార నేతలతో కూడిన ఆలయ కమిటీ పేరుతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఆలయంలో కొందరు ఉద్యోగులకు ఇష్టానుసారంగా వేతనాలు పెంచేశారన్న విమర్శలున్నాయి. డబ్బులు తీసుకొని వేతనాల పెంపునకు సిఫార్సు చేశారంటున్నారు. కొందరి విషయంలో ఈవో సిఫార్సు చేయగా… తిరస్కరించాల్సిన సంయుక్త కమిషనర్‌ ఆమోదించడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారి ఎలా అనుమతించారన్న విషయం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుత ఈవో నియామకంపైనా ఆది నుంచి విమర్శలున్నాయి.

నిర్మాణంలోనూ..: ఈ ఆలయాన్ని విశాఖ డెయిరీ విరాళంగా ఇచ్చిన రూ.50 లక్షలతో అప్పటి ఇన్‌ఛార్జి ఈవో శాంతి హయాంలో నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ పనులు దాదాపుగా పూర్తవ్వగా ఇష్టానుసారంగా చేపట్టారు. దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం వాటిని పూర్తిచేయలేదని, కొన్ని చోట్ల నాణ్యతా లోపంగా చేశారన్న విమర్శలు ఉన్నాయి. క్యూలైన్ల విషయంలో టెండరు పిలవకుండా ఒకే గుత్తేదారుకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని, గతంలో అమ్మవారి పండగపుడు చేసిన విద్యుత్తు దీపాలంకరణ ఖర్చు ఎక్కువ చేసి చూపించారన్న విమర్శలున్నాయి.

Source : ఈనాడు