
సమాజంలో ఆధ్మాత్మిక భావవ్యాప్తిని పెంచేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తామని టీటీడీ(TTD) తెలిపింది. హైందవ ధర్మాన్ని హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మరింతగా వ్యాప్తి చేసేందుకు, మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్నారుల్లో మానవతా విలువలు పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు చేపడుతుందన్నారు.
ధార్మిక సదస్సు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకు 57 మంది పీఠాధిపతులు సదస్సుకు విచ్చేసేందుకు సమ్మతించారన్నారు.
శ్రీవారి ఆలయం నుండి ఏ సందేశం వెళ్లినా భక్తులందరూ ఆచరిస్తారని ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 16 సంవత్సరాల కిందట ధార్మిక సదస్సులు నిర్వహించామని చెప్పారు. అప్పుడు పీఠాధితులు చేసిన సూచనల మేరకే దళితగోవిందం, కల్యాణమస్తు, గిరిజన గోవిందం, కైశికద్వాదశి లాంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు.
సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. సదస్సు ను విజయవంతం చేసేందుకు ముగ్గురు సీనియర్ అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ స్వామిజీకి ఓ లైజినింగ్ అధికారిని నియమించాలన్నారు.





